ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటన విడుదల చేశారు. రెండ్రోజులుగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని.. అసలు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు తెలియదని పేర్కొన్నారు.
యూపీలో తన అరెస్టు విషయంపై లేఖ విడుదల చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. తన అరెస్టుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియదని.. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదని పేర్కొన్నారు. 40 గంటలుగా పీఏసీ కాంపౌండ్లోనే ఉంచారని తెలిపారు.
రెండ్రోజులుగా ఏ మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదని.. తన న్యాయవాదిని కలిసేందుకు కూడా అనుమతించట్లేదని చెప్పుకొచ్చారు. “అరెస్ట్ చేసిన సమయంలో నేను సీతాపుర్ జిల్లా పరిధిలో పర్యటిస్తున్నాను. ఆ ప్రాంతం ఘటనాస్థలికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను పర్యటించిన ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలులో లేదు. ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పట్లేదు. అసలు ఎఫ్ఐఆర్ ఏం నమోదు చేశారో కూడా తెలీదు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఎఫ్ఐఆర్లోని కొన్ని వివరాలు తెలిశాయి. అందులో పేర్కొన్న 11 మందిలో 8 మంది అరెస్ట్ సమయంలో అసలు అక్కడ లేరు.” అని ప్రియాంక గాంధీ అన్నారు. లఖింపుర్ ఘటన తర్వాత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లిన ప్రియాంకను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.